హుజూరాబాద్ : ఏడేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ హుజూరాబాద్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మార్చివేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. శనివారం ఆయన పట్టణంలో రూ.56 కోట్లతో మున్సిపల్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకెళ్తుంటూ హుజూరాబాద్లో ఈటెల నిర్లక్ష్యంతో గతంలో ఉన్న రోడ్లు పూర్తిగా పాడైనా.. మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
హుజూరాబాద్ దుస్థితిపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి తక్షణం రూ.35కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో రూ.25కోట్లు మురికి కాలువలు, రోడ్లకే కేటాయించినట్లు చెప్పారు. మరిన్ని పనులు పెండింగ్లో ఉండడంతో మరో రూ.15కోట్లు విడుదల చేశారని తెలిపారు. వీటితో 150 రోడ్లను, బోర్నపల్లి ఇతర శివారు రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్లో మాదిరిగా రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లతో రోడ్డును ఆధునికీకరిస్తామన్నారు.
మరో నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయి.. హుజూరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మలా కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.