కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 20: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ చేయూతనిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన సోదరుడి పేరిట రూ.20 లక్షల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు.
బుధవారం ఆయన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ.65 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రూ.2 లక్షలు ఇస్తే మేనేజ్మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. రూ.10 లక్షలిస్తే తరగతి గదికి, రూ.కోటి ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెడుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, నగర మేయర్ వై సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.