హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల పనులను వేగవంతం చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. భూములు, నిధుల కేటాయింపు పొందిన సంఘా లు, ఇతర సంఘాలతో ఈ నెల 8న సమావేశం నిర్వహించాలని సూచించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై సోమవారం ఆయన ఖైరతాబాద్లోని కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. సంబంధిత కుల సంఘాల బాధ్యులు ఏకసంఘంగా ఉంటే.. ఆయా భవన నిర్మాణాల పర్యవేక్షణను వారికే అప్పగించాలనేది సీఎం కేసీఆర్ అభిమతమని చెప్పారు. 40 కుల సంఘాలకు కోకాపేట, ఉప్పల్ భగాయత్లో 82.30 ఎకరాల స్థలంతోపాటు రూ.100 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. బీసీ గురుకులాల్లో వసతులు, కరోనా వ్యాధి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.