మహబూబాబాద్ : పెద్దవంగర మండల కేంద్రంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పండుగలు నిర్వహిస్తున్నదన్నారు. రూ.333.14కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు చీరెలు పంపిణీ చేస్తుందని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ పేదలకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు సాయాన్ని అందించారన్నారు. వచ్చే నెల నుంచి 57 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు కట్టించే పథకం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జీవీబీ బ్యాంక్ లింకేజీతో మండలంలోని 20 సంఘాలకు రూ.కోటి చెక్కును సంఘాలకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, సీఈవో రమాదేవి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ రఘువరన్, ఆర్డీఓ రమేశ్, ఎంపీపీ రాజేశ్వరి, వైస్ ఎంపీపీ కల్పన, జడ్పీటీసీ జ్యోతిర్మయి, తహశీల్దార్ సరితరాణి, ఎంపీడీఓ శేషాద్రి, డీసీసీబీ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, లక్ష్మి, శర్మ తదితరులు పాల్గొన్నారు.