మెల్బోర్న్: కంగారూల గడ్డపై శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో నాలుగింట ఓడిన లంక ఆఖరి పోరులో నెగ్గి పరువు కాపాడుకుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 చేసింది. మాథ్యూ వేడ్ (43*), గ్లెన్ మాక్స్వెల్ (29), జోష్ ఇంగ్లిస్ (23) రాణించగా.. లహిరు కుమార, దుష్మంత చమీరా తలా రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య చేధనకు దిగిన లంక 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి విజయం సాధించింది. కుశాల్ మెండీస్ (58 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీతో విజృంభించగా.. కెప్టెన్ దసున్ శనక (35) రాణించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లను దునుమాడుతూ మెరుపులు మెరిపించిన మెండిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా, మ్యాక్స్వెల్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.