
అవకాశమిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామని, పురుషులతో సామానంగా ప్రతిభను నిరూపిస్తామని అంటున్నారు నేటి తరం మహిళలు. కూలీ పని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకున్న సిద్దిపేట జిల్లా మిట్టపల్లి మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. పదిహేను మంది కలిసి దుర్గాభవాని, శ్రీరామ అనే రెండు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి కారం, పసుపు తయారు చేసి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. సరుకు తయారీ నుంచి మార్కెటింగ్ వరకు నాణ్యతలో రాజీ పడకుండా, ఆకర్షణీయమైన ప్యాకింగ్తో, అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇప్పటికే మిట్టపల్లి బ్రాండ్ పేరుతో పప్పులు విక్రయిస్తూ మంచి పేరు సంపాదించుకోవడంతో కారం, పసుపును కూడా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీరి వద్ద సరైన యంత్రాలు లేకపోవడంతో మంత్రి హరీశ్రావు రూ. 58లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే యంత్రాలు కొని ఉత్పత్తిని మరింత పెంచి వ్యాపారాన్ని విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పొదుపు చేయడమే కాదు.. వ్యాపారంలోనూ సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి మహిళలు. 15మంది కలిసి దుర్గాభవానీ, శ్రీరామ అనే రెండు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి కారం, పసుపు తయారుచేసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సరుకు తయారీ నుంచి మార్కెటింగ్ వరకు నాణ్యతలో రాజీపడకుండా, ఆకర్షణీయమైన ప్యాకింగ్తో, అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇప్పటికే మిట్టపల్లి బ్రాండ్ పేరుతో ఈ గ్రామ మహిళలు పప్పులు విక్రయిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. వీరి ఉత్పత్తులు నాణ్యతగా ఉండడంతో కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. యంత్రాల కొనుగోలుకు వీరికి మంత్రి హరీశ్రావు రూ.58 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే యంత్రాలు కొని ఉత్పత్తిని మరింత పెంచి వ్యాపారాన్ని విస్తరిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సమాజ పురోగతికి, దేశ అభ్యున్నతికి పురుషులతో పాటు మహిళలూ అన్ని రంగాల్లో భాగస్వాములైనప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సైతం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలువాలని నిత్యం ఆకాంక్షించేవారు. ఏదైనా వ్యాపారం చేసేలా సందర్భం వచ్చినప్పుడల్లా వారికి దిశానిర్దేశం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ మహిళలకు కారం, పసుపు తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఏర్పాటు చేసిన మిట్టపల్లి పప్పుల బ్రాండ్లాగే ఇప్పుడు మిట్టపల్లి కారం, మిట్టపల్లి పసుపు పేరుతో ఇప్పటికే మార్కెట్లో వినియోగదారులకు విక్రయించడం ప్రారంభించారు.
15 మంది మహిళల సమిష్టి కృషి..
మిట్టపల్లి గ్రామానికి చెందిన 15 మంది మహిళలు దుర్గాభవాని, శ్రీరామ అనే రెండు గ్రూపులుగా సంఘటితమై 7 మంది కారం, 7 మంది పసుపును తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మీ నరసింహారెడ్డి సహకారంతో కారం, పసుపు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకున్నారు. అంతే కాకుండా, ప్రతి ఒక్కరూ రూ.15 వేల చొప్పున జమ చేసుకొని కారం, పసుపు పొడిలను తయారు చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ఎండు మిర్చిని వరంగల్ మార్కెట్ నుంచి, పసుపు కొమ్ములను నిజామాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మహిళలు ఎలాగూ ఇంట్లో వాటిని చేసుకునే అనుభవం ఉంది కాబట్టి ఆ విధంగానే కారం, పసుపును తయారు చేసి ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
స్వచ్ఛమైన కారం, పసుపు తయారీ..
సాధారణంగా బయట దుకాణాల్లో దొరికే మాదిరిగా కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నట్టే నాణ్యమైన కారం, పసుపును ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి వీరి వద్ద ఎలాంటి మిషనరీ లేకున్నా బయట పట్టించి, వారే సొంతంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇంత నాణ్యమైన కారం, పసుపును అధిక లాభాలు ఆశించకుండా ప్రజలకు అందించడంపై మంత్రి హరీశ్రావు, ఎంపీపీ వంగ సవితా ప్రవీణ్ రెడ్డి అభినందిస్తున్నారు. అంతే కాకుండా త్వరలో కారం, పసుపును తమ వద్దే పట్టుకునేలాగా యంత్రాలను సైతం సిద్ధం చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే పసుపు, కారం, నూనె మిల్లుల కోసం మంత్రి హరీశ్రావు స్వయం సహాయక గ్రూపుల సహకారంతో సుమారు రూ.58 లక్షలు మంజూరు చేశారని, అతి త్వరలోనే యంత్రాలను సమకూర్చుకొని మరింత ఎక్కువ మోతాదులో తయారు చేసి ప్రజలకు అందిస్తామన్నారు. కారం, పసుపుతో పాటు ఆయిల్ తయారీ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు.
ఇప్పటిదాకా 10 క్వింటాళ్ల పసుపు, 20 క్వింటాళ్ల కారం అమ్మినం..
మేము గత ఆరు నెలల్లో సుమారు 20 క్వింటాళ్ల కారం, 10 క్వింటాళ్ల పసుపు అమ్మినం. మనం ఇంట్లో చేసుకున్నంత నాణ్యతగా ఇక్కడ తయారు చేస్తం. ఎంతో శుభ్రంగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తాం. రోజుకు దాదాపు 20 కారం, 20 పసుపు ప్యాకెట్లు తయారు చేస్తున్నాం. త్వరలోనే కారం, పసుపు గ్రైండింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే మంత్రి హరీశ్రావు సార్ పైసలు మంజూరు చేశారు.
ప్రజాప్రతినిధుల సహకారంతోనే ముందుకు..
మహిళలందరం సమిష్టిగా ముందుకు వెళ్తున్నామంటే అందుకు కారణం మంత్రి హరీశ్రావు, గ్రామ సర్పంచ్, ఎంపీపీలే. ఇంత మంచి ప్రోత్సాహం ఇస్తున్నందుకు వారికి రుణపడి ఉంటాం. మిషన్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుని వారందరి నమ్మకాన్ని నిలబెడతాం. మాకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.