మెదక్, అక్టోబర్ 18 : ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించే పథకం మిషన్ భగీరథ. రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకా రం చుట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఎంపీపీ కార్యాల య ఆవరణలో 2015 జూలై 12న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని ఆయా ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైలాన్కు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్థల సేకరణ చేశారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున గల చిల్డ్రన్స్ పా ర్కులో మిషన్ భగీరథ పైలాన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడే పైలాన్ను నిర్మించారు. పైలాన్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్తో పాటు కుటుంబమంతా ఏలేన్లో కూర్చొని పైలాన్ అందాలను వీక్షించేలా ఏర్పాటు చేశారు. పైలాన్ పార్కు అభివృద్ధిలో భాగంగా ఆధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుమారు రూ.కోటితో పైలాన్తోపాటు గార్డెన్స్, పైలాన్ ముందు గేటు ఆర్చి, లవ్ మెదక్ సింబల్ ఇలా పైలాన్ను సూపర్గా నిర్మించారు.
రూ. కోటితో అభివృద్ధి పనులు..
జిల్లా కేంద్రంలో పైలాన్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. పైలాన్ పార్కులో చక్కటి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలు, పైలాన్ ముందు గేట్ ఆర్చికి రూ.12 లక్షలు, మిషన్ భగీరథ లవ్ మెదక్ సింబల్కు రూ.4.5 లక్షలు, బిల్డింగ్కు రూ.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో అత్యాధునికంగా పైలాన్ను నిర్మించారు. సందర్శకుల సౌకర్యార్థం టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ఏ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు వేదికగా ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథ పైలాన్తో జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోనున్నాయి.
ఆహ్లాదకరంగా పార్కు..
జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ చుట్టూ ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేశారు. పార్కు మధ్యలో పచ్చని గడ్డితో అందమైన ఏలేన్ను ఏర్పాటు చేశారు. అందరూ ఏలేన్లో కూర్చొని పైలాన్ అందాలను వీక్షించవచ్చు. ఒక్కప్పుడు చిల్డ్రన్స్ పార్కులో చిన్న పిల్లలతోపాటు కుటుంబ సభ్యులు సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చి ఆహ్లాదకరంగా గడిపేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ పైలాన్ ఏర్పాటుతో పార్కు పచ్చదనంతో కనబడుతుంది.
అత్యాధునికంగా పైలాన్ ఏర్పాటు..
జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో మిషన్ భగీరథ పైలాన్ను అత్యాధునికంగా నిర్మించాం. పైలాన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది. పార్కును ఏర్పాటు చేసి చుట్టూ పచ్చదనాన్ని పెంచడంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేశాం. పైలాన్ ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో రూపురేఖలు మారిపోయాయి.