సహరాన్పూర్: డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజస్వరూపం బయటపడుతున్నది. పైన పటారం, లోన లొటారం అన్న చందంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తయారైంది. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ అన్ని రంగాల్లో దూసుకుపోతుందంటూ చేస్తున్న ప్రచారం పూర్తి గాలివాటమని తేలిపోయింది. క్రీడల పట్ల యోగీ సర్కార్ వైఖరి ఏంటో మరోమారు తేటతెల్లమైంది. రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ టోర్నీలో ప్లేయర్లకు కల్పించిన సౌకర్యాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాలికల కోసం భోజన ఏర్పాట్లు ఎక్కడ చేశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. స్టేడియంలో మరమ్మత్తులు కొనసాగుతున్నాయన్న సాకుతో పాయిఖానలో ప్లేయర్లకు తిండి ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన ఆ నోటా ఈ నోటా పాకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవైపు కంపు కొడుతున్న పురుషుల మూత్రశాలల మధ్య అహారాన్ని నేలపై ఉంచి ఇక తినండి అంటూ అధికారులు ఆదేశించారు. పాపం అప్పటికే ఆడి అలసిపోయి..ఆకలితో ఉన్న అమ్మాయిలు చేసేదేమి లేక కంపుకొడుతున్న టాయిలెట్లలో ఉన్న ఆహార పదార్థాలను తినాల్సి వచ్చింది. ఒక పెద్ద పళ్లెంలో అన్నం పెట్టిన..నిర్వాహకులు చిన్న పేపర్లో పూరీలతో పాటు వేర్వేరు పాత్రలలో కూరలు పెట్టి తమ నైజాన్ని చాటుకున్నారు. ఈ ఉదంతం సోషల్మీడియాలోకెక్కడంతో రచ్చ రచ్చ అయ్యింది. నిమిషం నిడివి కల్గిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్గా మారింది. ఓవైపు టాయిలెట్లు అక్కడే భోజన ఏర్పాట్లు, ప్లేయర్లు పడుతున్న కష్టాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీజేపీ సర్కార్పై ఆగ్రహ జ్వాలలు:
ఆహా ఓహో అంటూ అభివృద్ధిపై ప్రగల్భాలు పలుకుతున్న యూపీలో బీజేపీ సర్కార్పై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. టీఎస్రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి సోషల్మీడియా ట్విట్టర్లో షేర్ చేస్తూ యోగీ సర్కార్ నిర్వాకంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఉత్తరప్రదేశ్లో కబడ్డీ ప్లేయర్లకు భోజనం ఏర్పాట్లు చేసిన తీరు ఇది. ప్లేయర్లకు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న మర్యాద ఇది. సిగ్గుచేటు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బీజేపీ ప్లేయర్లకు భోజన వసతి కల్పించేందుకు డబ్బులు లేనట్లు వ్యవహరిస్తున్నది అంటూ ట్వీట్ చేసింది. ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరీ..సతీశ్రెడ్డి ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ‘ఇది క్షమార్హం కాదు’ అని రాసుకొచ్చారు.