ఖైరతాబాద్ : కరాటే, ఇతర మార్షల్ఆర్ట్స్ మనిషి వ్యక్తిత్వం, గుణాన్ని మెరుగుపరుస్తుందని సినీనటుడు సుమన్ అన్నారు. డిసెంబర్ 19న సరూర్నగర్ స్టేడియంలో కియో జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిం చనున్న వైఎస్ఆర్ మెమోరియల్ జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.
అసోసియేషన్ చైర్మన్ బండారు వెంకటరమణ, జాతీయ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు సాయికుమార్తో కలిసి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడుతూ కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు సేవలు చేస్తే…. రైతులు ఆకలి తీర్చారన్నారు.
లాక్డౌన్ సమయంలో పంటలు వేయకుండా ఉంటే నేడు తిండి పుట్టేది కాదన్నారు. ఈ మధ్య కాలంలో యువకులు పది మెట్లు ఎక్కాలంటే ఆయాసపడిపోతున్నారని, ఇక మధ్య, వృద్ధాప్యం వస్తే వారి పరిస్థితి ఏమిటని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, అది భద్రతతో పాటు జీవితానికి, ఆరోగ్యానికి భరోసా కూడా ఇస్తుందన్నారు.
ఈ రంగంలో ఉన్న వారు ఎప్పుడు తలుపుతట్టినా సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. వైఎస్ఆర్ పేరిట పోటీలు నిర్వహించడం అభినందనీయమని, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి పథకాలు తీసుకువచ్చి ప్రజలకు విశేష సేవలందించారన్నారు.
వెంకటరమణ మాట్లాడుతూ ఈ పోటీల్లో పదికిపైగా రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వస్తున్నారని, జగన్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్మూరు వెంకట్ రెడ్డి, బి. అనిల్ కుమార్, ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.