గచ్చిబౌలిలోని డాగ్పార్క్లో మార్స్ పెట్కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండిస్ డాగ్ షో” ఆకట్టుకుంది. వీధి, పెంపుడు కుక్కల దత్తతను ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఈ డాగ్షోలో వివిధ రకాల శునకాలు తమ అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నాయి. తమదైన శైలిలో ఫ్యాన్సీ డ్రెస్తో అందమైన శునకాలు పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నాయి. ఆదివారం డాగ్పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కలకు సేవలందించేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శునక అంబులెన్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం డాగ్ పార్క్లను ఏర్పాటు చేసి వీధి కుక్కల దత్తత, పెంపుడు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, వీధి కుక్కలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్స్ పెట్కేర్ ఇండియా జనరల్ మేనేజర్ గణేశ్ రమణి, డాక్టర్ మురళీ తదితర ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు.