Mansukh Mandaviya| కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత, వ్యాక్సినేషన్, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలతో పాటు పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్పై కూడా మాండవీయ సమీక్ష నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం దేశం కరోనాతో పోరాడిందని, దీంతో కొంత అవగాహన వచ్చిందని, ఆ అవగాహనను పరిగణనలోకి తీసుకుంటూ ఒమిక్రాన్ వేరియంట్ను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని మాండవీయ సూచించారు.
నిరంతర కృషి, నిరంతర అప్రమత్తతతోనే కరోనాపై విజయం సాధించగలమని అన్నారు. మరోవైపు సోమవారం నుంచి 15 నుంచి 18 వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోందని, ఈ విషయంలో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకొని, అన్ని రాష్ట్రాలూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే వుండాలని ఆయన కోరారు. నూతన మార్గదర్శకాలను అమలు చేయడంలో ఏమాత్రం అలసత్వం కూడదని మాండవీయ అన్ని రాష్ట్రాలకు సూచించారు.