Lakshmi Manchu | గద్వాల, జూన్ 28 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించి.. ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, మాట్లాడాలన్న లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సినీనటి మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆమె జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిశారు. ఈ సందర్భంగా మంచులక్ష్మీ మాట్లాడుతూ గద్వాల.. చేనేత చీరలకు ప్రసిద్ధి అని అన్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని 56 పాఠశాలల్లో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దాని స్ఫూర్తిగా ఏటా కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యాబోధన మూడు స్థాయిల్లో జరుగుతుందని.. ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఆంగ్లబోధన ఉంటుందన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను ఎంపిక చేశామని, వాటిలో టీవీ, వాల్పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు. 30 పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్పై సంతకం చేశారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, డీఈవో సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.