Crime News : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం మొరేనా జిల్లా (Morena district) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మాతా బసైయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల బలరామ్ కుష్వాహా (Balaram Kushwaha), అతడి భార్య, 32 ఏళ్ల రవితా కుష్వాహా (Ravita Kushwaha) మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం గ్రామంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రవిత డ్యాన్స్ చేసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దాంతో రవిత పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్దిచెప్పి జూన్ 24న తిరిగి అత్తగారింటికి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బలరామ్ తన భార్య, ఇద్దరు మైనర్ కుమారులను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సమీపంలోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంతసేపటికే బలరామ్ మృతదేహాన్ని కూడా గుర్తించారు.
భార్యాభర్తల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయిని, ఈ క్రమంలో డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ ఈ దారుణాలకు దారితీసిందని, తమ ప్రాథమిక విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయని మొరేనా డీఎస్పీ విజయ్ భదోరియా వెల్లడించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.