Khushbu Sundar | కోలీవుడ్ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన కుమార్తె వివాహ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంపై వచ్చిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ తరుణంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిపోగా, ఖుష్బూ తన భర్త సుందర్ సితో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడం సరికాదంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. భాగ్యరాజ్ మరణించిన సమయంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ ప్రశ్నించిన ఒక యూజర్పై ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం విమర్శించడానికే తనను ఫాలో అవుతున్నారా అని ప్రశ్నిస్తూ, తన కుమార్తె వివాహం జరిగి కనీసం 48 గంటలు కూడా కాలేదని, భాగ్యరాజ్ భార్య పూర్ణిమతో తనకున్న సాన్నిహిత్యం గురించి ఇతరుల కంటే తనకే బాగా తెలుసని స్పష్టం చేశారు. నచ్చకపోతే తనను ఫాలో అవ్వడం మానేయాలని, సంతోషంగా ఉండే హక్కు తనకు ఉందని ఆమె బదులిచ్చారు.
గోవాలో గురువారం సాయంత్రం జరిగిన ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అమల, త్రిష, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటీనటులు ఈ వివాహానికి విచ్చేసి సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకలో భాగ్యరాజ్ కూడా పాల్గొని చిరంజీవిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చివరి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల విమర్శలు ఒకవైపు వస్తున్నప్పటికీ, ఖుష్బూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భాగ్యరాజ్ చిత్రపటాన్ని పంచుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో గడిపిన సరదా క్షణాలు తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా భారతీయ సినీ రంగంలో భాగ్యరాజ్ అద్భుతమైన ముద్ర వేశారు. అంద 7 నాట్కల్, ముంధానై ముడిచ్చు, చిన్న వీడు వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన అందించారు. అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఆఖ్రీ రాస్తా’కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. 73 ఏళ్ల వయసులో కన్నుమూసిన భాగ్యరాజ్కు భార్య పూర్ణిమ, పిల్లలు శంతను, శరణ్య ఉన్నారు. విమర్శలు ఎలా ఉన్నా, ఒకే సమయంలో కుటుంబంలో వివాహ వేడుకలు జరగడం, మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన పెద్దాయన మరణించడం ఈ వివాదానికి దారితీసింది