న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదం ముదురుతున్నది. మమత శుక్రవారం తూర్పు మిడ్నాపూర్లో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ‘రాజ్భవన్ నుంచి మీకు బెదిరింపులు రావడం లేదా.. వారు మీ అధికారంలో జోక్యం చేసుకోవడం లేదా’ అని బహిరంగంగానే తూర్పు మిడ్నాపూర్ ఎస్పీని అడిగారు. దీనిపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా తీవ్రమైన, ఆందోళన చెందాల్సిన విషయం. మీడియా ముందు సీఎం మమత ఎలా రాజ్భవన్ కార్యకలాపాలపై ప్రశ్నిస్తారు’ అని ట్వీట్ చేశారు. గవర్నర్ జగదీప్ ధన్కర్ను మమత ట్విట్టర్లో బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.