సిద్దిపేట/చేర్యాల : జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయవర్గాలు ఒగ్గు పూజారులతో పెద్ద పట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవాన్ని, స్థల పురాణాన్ని ఒగ్గు పూజారులు పంచరంగులతో తయారు చేసిన పట్టం వద్ద జానపదరీతిన పాటలు పాడుతూ పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మహా శివరాత్రి సందర్బంగా లింగోద్భవ కాలం గురువారం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాలలో ఊరేగించారు. ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో పంచరంగులు కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తంగెడు పిండి, గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం దాటగానే భక్తులు పట్నం దాటి స్వామి వారిని దర్శించుకున్నారు.