కుమ్రం భీం ఆసిఫాబాద్ : పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 0-5 సం.ల వయస్సు గల పిల్లలు పోలియో చుక్కలు వేయాలన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లాలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యవేక్షక అధికారులు, సూపర్ వైజర్లు, మొబైల్ టీమ్స్ నియమించి రూట్లు కేటాయించామని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్ నిర్మాణ పనులు పరిశీలించారు. బర్త్ వెయిటింగ్ భవనం, సి. టి. స్కాన్, వైరలాజీ, ఆర్. టి. పి. సి. ఆర్. ఏర్పాటు చేస్తున్న గదులను పరిశీలించారు.
పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే వ్యాధి నిర్ధారణ త్వరగా చేసి వైద్య సేవలు మరింత మెరుగు పరిచే అవకాశం ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, వైద్య అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.