శివకేశవులు ఎక్కడ దేద్వీప్యమానంగా వెలుగొందుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో పరమశివుడు స్వయంభువుడిగా, శ్రీ సిద్దరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రంగా వెలసి భక్తుల మొర ఆలకిస్తున్నారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని శివుడి అరుదైన ఆలయాల్లో ఒకటిగా విశిష్టతతో కూడుకున్నది. సిద్దేశ్వర స్వామి ఇక్కడ అత్యంత శక్తివంతమైనదని ప్రజలు విశ్వసిస్తారు. ఆలయానికి సమీపంలో నీటి బావి ఉంటుంది. ఏడాది పొడవునా భక్తులకు నీరు అందుబాటులో ఉండడంతో అక్కడ స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఏటా సిద్దరామేశ్వర స్వామి ఉత్సవాలతోపాటు కార్తీక, శ్రావణమాసాల్లో ప్రత్యేక పూజలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.
శివలింగం రివర్స్ ప్రత్యేకత..
స్వయంభు సిద్దరామేశ్వర గర్భాలయంలో శివలింగం రివర్స్ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో చక్కని శిల్పాలతోకూడిన అందమైన ముఖ మండపం ఉంటుంది. 7కలశాలతో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రాజగోపురం అందంగా ఉంటుంది. దశాబ్దాల కిందట నిర్మించిన ఆలయం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఈ ఆలయానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచేకాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
నిత్య పూజలతో వెలుగొందుతున్న ఆలయం..
స్వయంభు శ్రీ సిద్ద రామేశ్వర ఆలయంలో రోజూ పూజలు నిర్వహించడంతోపాటు, ఏడాదికోసారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఏటా ఈ ఆలయంలో కార్తీక మాసం పూజలు, మహాశివరాత్రి వేడుకలు, స్వామి వారి కల్యాణోత్సవం, రథోత్సవం, జాతర, శ్రావణ మాసం పూజలు, ఫాల్గుణ మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో నిత్యం స్వామి వారికి అర్చనలు, అభిషేక పూజలు, బిల్వార్చన, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, గ్రహదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి మహాగణపతి పూజ, మహా రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, సాంబ సదాశివ భజన కార్యక్రమాలు జరుపుతుంటారు.
1331 లీటర్ల పెరుగుతో నేడు మహారుద్రం ..
స్వయంభూలింగ శ్రీ సిద్దరామేశ్వరాలయంలో గురువారం మహారుద్రం నిర్వహించనున్నారు. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టనున్నారు. 1331 లీటర్లతో పెరుగుతో నిర్వహించే మహారుద్రం కార్యక్రమానికి భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొనాలని మాధవానంద సరస్వతీ స్వామి శిష్యబృంద సభ్యులు కోరారు.