ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొత్తగా ఏర్పాటు చేసిన నిర్భయ స్క్వాడ్లను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కలిసి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సం సందర్భంగా ముంబైలో మహిళలపై దాడులు, లైంగికదాడుల నిరోధానికి 91 నిర్భయ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలను కూడా సమకూర్చారు. కాగా, ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళలు, పురుష అధికారులు ఈ నిర్భయ స్క్వాడ్లలో 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు.
ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం 103కి డయల్ చేయవచ్చని అన్నారు.
కాగా, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెన్నుముఖ ఆపరేషన్ తర్వాత చాలా రోజులు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇటీవల ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 23న నేతాజీ, తండ్రి బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేతో కలిసి వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు.