ముంబై: మహారాష్ట్రలో శివసేన, బీజేపీ పరస్పర ఆరోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఠాక్రే కుటుంబాన్ని కేంద్రమంత్రి నారాయణరావు రాణే బెదిరించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. బెదిరింపులు మానుకోకపోతే ముంబైలో మీ వసూళ్ల బండారం బయటపెడతానని హెచ్చరించారు. ‘నువ్వు కేంద్రమంత్రివి కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర. మేము మీ బాబులాంటి వాళ్లం.. దీని అర్థమేమిటో నీకు తెలుసు’ అంటూ ఘాటుగా స్పందించారు. ‘మా జాతకం నీదగ్గర ఉందంటున్నావు.. నీ జాతకం మా దగ్గర ఉందని మరచిపోకు’ అన్నారు. బాంద్రాలో సీఎం నివాసం ఉండే మాతోశ్రీ రెసిడెన్సీలో ఉండే నలుగురిపై ఈడీ నోటీసులు సిద్ధంగా ఉన్నాయంటూ రాణే పేర్కొనడంపై రౌత్ ఈ మేరకు స్పందించారు.