అంటాననారివో, డిసెంబర్ 22: ‘నాకు చివరి ఘడియలు ఇంకా రాలేదు’.. హెలికాప్టర్ ప్రమాదం వల్ల సముద్రంలో పడిపోయి.. 12 గంటలు నిరంతరంగా ఈదుతూ.. మృత్యుంజయుడై ఒడ్డుకు చేరిన మడగాస్కర్ పోలీసు శాఖ సహాయమంత్రి సెర్జ్ గెలి నోటి నుంచి వెలువడ్డ మాటలు అవి. సముద్రంలో పడవ మునిగి 39 మంది మరణించారన్న వార్త అందగానే ప్రమాద స్థలానికి ఆయన బయలుదేరారు. ఈక్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సముద్రంలో కూలింది. అదృష్టవశాత్తు ఊడిపోయిన హెలికాప్టర్ సీటు ఒకటి దొరికింది. దానిని పట్టుకొని మంత్రి సముద్రంలో ఈదడం మొదలుపెట్టారు. సుమారు 12 గంటల తర్వాత ఓ జాలర్ల బృందం ఆయనను రక్షించింది.