హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆదివారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్రాజ్, మంచు విష్ణులకు పోలింగ్ ప్రక్రియపై వివరించారు.
రేపు (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. రాత్రి 8 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు జరిగే ఎన్నికల్లో సుమారు దాదాపు 880మందికిపైగా సభ్యులు ఓటు వేసే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో హోరాహోరీగా సాగుతున్నాయి. మా ప్రెసిడెంట్ పదవికి నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రెండు ప్యానళ్ల మధ్య ఇప్పటికే మాటలయుద్ధం కొనసాగుతున్నది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.