హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి దవాఖానలో దేశంలోనే తొలి ఆఫ్తాల్మిక్ రిసెర్చ్ బయోరిపాజిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు దవాఖాన క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సుధా ఎస్ మూర్తి వెల్లడించారు. సోమవారం ఎల్వీపీఈఐలోని కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేశామని తెలిపారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ కొత్తపల్లి రవీంద్రనాథ్ సహకారంతో ఈ కేంద్రాన్ని స్థాపించినట్టు వివరించారు. వ్యాధి కారకాలు, చికిత్సలు, రోగనిర్ధారణలతో భవిష్యత్తు పరిశోధనలకు సేకరించిన హ్యూమన్ టిష్యూలను ఈ కేంద్రంలో డిపాజిట్ చేస్తామని తెలిపారు. ము ఖ్యంగా కణజాలాల అధ్యయనం, అంధత్వానికి దారితీసే వ్యాధులు, రోగి నమూనాల భద్రత, అరుదైన కం టి వ్యాధుల నివారణకు అవసరమైన పరిజ్ఞానం వంటి అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు గీతా వేముగంటి, ప్రశాంత్ గార్గ్, సౌమ్య జకతి తదితరులు పాల్గొన్నారు.