హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎస్సై ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థులపాలిట వరంగా మారనున్నది. మొత్తం 200 మార్కులకు ఈ నెల 7 నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్ఎల్పీఆర్బీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీలో పేర్కొన్న ప్రకారం తప్పులు దొర్లిన మొత్తం 8 ప్రశ్నలను తొలగించినట్టు బోర్డు తెలిపింది. ఆ ఎనిమిది ప్రశ్నలకు 8 మార్కులను అభ్యర్థులకు కలపనున్నట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 60 (30శాతం) వస్తే వారిని తర్వాతి దశకు అర్హులుగా నిర్ణయించారు. మొత్తం 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రాథమిక పరీక్షలో 52 మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం తర్వాతి దశకు అర్హులుగా గుర్తించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంటే 60 మార్కులకు బదులు, 52 మార్కులు సాధించిన వారు సైతం తర్వాతి దశకు అర్హత సాధించినట్టే. పరీక్ష నిర్వహణలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలు రూపొందిస్తారని, ఒక భాష నుంచి ప్రశ్నలు మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు రెండు, మూడు (ఏ,బీ,సీ,డీ ఆప్షన్లలో) సమాధాలు సరైనవిగా ఉండటం, కొన్నిసార్లు 4 ఆప్షన్లలో కూడా సమాధానం లేకపోవడం వంటి కారణాలతోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్టు వివరించారు. www.tslprb.inలో ప్రిలిమనరీ కీ అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు వారి బుక్లెట్ కోడ్ ఆధారంగా సరిచూసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.కొత్త రికార్డు దిశగా టీఎస్ఎల్పీఆర్బీ
ఈ నెల 28న ఏకంగా 6.5 లక్షల మందికి ప్రిలిమ్స్
ఈ నెల 28 నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కొత్త రికార్డు నమోదు చేయబోతున్నది. స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోనున్నది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనున్నది. ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. పోలీస్శాఖలోని మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టులు, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకుగాను మొత్తం 6,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 28కి వాయిదాపడింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు.