Garikapati Narasimha Rao | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఒక ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా, పాఠశాలకు వచ్చే పిల్లలను శోభనపు పెళ్ళికొడుకులతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు చదువు కోసం కాకుండా కేవలం ఉచిత భోజనం కోసమే బడికి వస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు.
‘గరికపాటి తన మనసులో ఉన్న కుసంస్కారాన్ని బయటపెట్టారని, ఈ సమాజంలోని ఆధిపత్య వర్గాలకు, మేధావులకు తరతరాలుగా పేదవారి చదువు, వారు తినే తిండిపై ఇలాంటి చులకన భావమే ఉంటుందని ఆయన మండిపడ్డారు. గరికపాటి లాంటి వారు గడ్డి మాటలు మాట్లాడుతుంటే, ఆయన ప్రవచనాలకు చప్పట్లు కొడుతున్న మూర్ఖులను చూస్తుంటే జాలి వేస్తోందని ఆర్.ఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ వివక్షను కూడా ప్రవీణ్ కుమార్ ఎత్తిచూపారు. మొన్న దళిత ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై దాడి చేసిన బండి సంజయ్ మరియు బీజేపీ గ్యాంగ్, ఇప్పుడు బ్రాహ్మణ వర్గానికి చెందిన గరికపాటి ఇంటికి వెళ్తారా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా గరికపాటిపై కేసులు పెట్టరని, జాతీయ బాలల హక్కుల సంఘం లేదా మానవ హక్కుల సంఘం ఆయనను కనీసం పిలిచి అడగవని విమర్శించారు. పేద పిల్లలు పోషకాహారం అందక అస్థిపంజరాలుగా మారి, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల జెండాలు మోసే రోబోలుగా మిగిలిపోవాలని వారు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. గరికపాటి లాంటి వ్యక్తులపై కేసులు పెట్టి చంచల్గూడ ‘అండా’ సెల్లో వేసినప్పుడే తెలుగు రాష్ట్రాల్లో నిజమైన విజ్ఞానం వికసిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పేదరికం, వివక్ష ఈ దేశంలో నేటికీ పోకపోవడానికి గరికపాటి లాంటి వారి ఆలోచనలే కారణమని, అందుకే రోహిత్ వేముల లాంటి వారు బలవుతున్నారని’ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.
గరికపాటి తన మనసులో మాటను చెప్పాడు. నిజానికి ఈ సమాజంలో చాలా మంది ఆధిపత్య వర్గాల పెద్దలకు-మేధావులకు తరతరాలుగా పేద వారి చదువులు, తినే తిండి మీద గరికపాటి లాంటి చులకన భావమే ఉంటూంది. దీనికి నా వద్ద వందల ఆధారాలు ఉన్నాయి.
వాళ్లు నటిస్తారు, ఈయన నటించలేదు.
అందుకే పేదరికం వివక్ష అనేవి ఈ… https://t.co/4sqX2o45ci— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 21, 2026