LK Advani భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎన్నికల సంఘం సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఓటరు లిస్టుకు సంబంధించి సరైన వివరాలు లేని కారణంగా సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో మొత్తం 33 లక్షల మందికి సర్ నోటీసులు జారీ కాగా వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీరి ప్రస్తుత ఓటరు వివరాలు సర్ 2002తో మ్యాపింగ్ కుదరకపోవడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఎల్కే అద్వానీతోపాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికకు కూడా సర్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, అద్వానీ కుమారుడు జయంత్కు మాత్రం ఎలాంటి నోటీసులు జారీ కాలేదు. అద్వానీ కుటుంబానికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓట్లున్నాయి. అలాగే, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు కూడా సర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రక్రియపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. తాజాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమ, కుమారుడు మీర్కు కూడా సర్ నోటీసులు వచ్చాయి.
అలాగే, కేంద్ర మంత్రి జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. వీరికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుందర్బాగ్లో ఓటు హక్కు ఉంది. వీరితోపాటు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతా ద్వివేది, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఆయన భార్య షెబా బ్రిట్టాస్, కుమారుడు ఆనంద్ బ్రిట్టాస్కు కూడా సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల ప్రకారం సంబంధిత వ్యక్తులు తగిన ధృవపత్రాలు నిర్ణీత గడువులోగా సమర్పించి, తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలి.