Crime | సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మోసం చేస్తున్నారు. బెట్టింగ్, డ్రగ్స్, సైబర్నేరాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్లలో ముందుగా ఫంటర్గా పెట్టుబడి పెట్టి, ఆ తరువాత సబ్ బుకీలతో పరిచయాలు పెంచుకొని, తన సర్కిళ్లలో ఉన్న వారిని బెట్టింగ్ వైపు మళ్లించేందుకు సబ్బుకీగా అవతారమెత్తుతున్నాడు. అలాగే డ్రగ్ కేసుల్లోను వినియోగదారుడిగా ఉంటూ ఆ తరువాత విక్రేతగా మారుతున్నారు. సైబర్నేరాల్లో పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, డేటా ఎంట్రీ పనులంటూ నమ్మి మోసపోయే వారు, తిరిగి అదే బాటలో ఇతరులను మోసం చేస్తున్న ఘటనల్లో ఇప్పటి వరకు అనేక మంది అరెస్ట్ అయ్యారు.
తాను మోసపోయాననే విషయం నెమ్మదిగా తెలుసుకున్నా.. నిందితులను పోలీసులకు పట్టించాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొదట్లోనే ప్రధాన నిందితులను పట్టుకుంటారు. అలా కాకుండా తన డబ్బులు ఇచ్చిన వారి వద్ద నుంచి రాబట్టుకోలేక, ఇతరులను మోసం చేసి సంపాదించాలనే ఆలోచన తప్పు. మరోకరిని మోసం చేయడం వల్ల నిందితులుగా మారుతారు. నేరాల బాట పట్టకుండా నేరం చేసిన వారిని చట్టానికి పట్టించాలని పోలీసులు సూచిస్తున్నారు.