సీనియర్ సిటిజన్లకు లైఫ్ సర్టిఫికెట్ కష్టాలు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను ప్రవేశపెట్టి వయో వృద్ధులకు ఊరటను కలిగించింది. ఇంటి వద్ద నుంచే ఈ డిజిటల్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చు. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్బీ) ద్వారా కూడా ఈ జీవన్ ప్రమాణ్ పత్రను అందుకోవచ్చు. దాదాపు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి. ఈ సర్వీసును పొందడానికి డీఎస్బీ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో తాను పింఛన్ పొందుతున్న బ్యాంకు వివరాలతోపాటు లైఫ్ సర్టిఫికెట్ను కూడా సమర్పిస్తే చాలు.. బ్యాంక్ ఏజెంట్ పేరుతోసహా మొబైల్కు సమగ్ర సమాచార రూపంలో ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. సదరు ఏజెంట్ పింఛన్దారుల ఇంటికే వచ్చి పింఛన్ చేతికందిస్తారు. చాలామంది పింఛన్దారులకు లైఫ్ సర్టిఫికెట్ ఎంతో కీలకం. ముఖ్యంగా వయసు మీదపడినవారికి ఇది లేకపోతే పింఛన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో బ్యాంకులు, పోస్టాఫీసు లేదా ఇతర పింఛన్ పంపిణీ కేంద్రాలలో దీనికోసం స్వయంగా హాజరు కావాల్సి వచ్చేది. జీవన్ ప్రమాణ్ పత్ర అని కూడా పిలిచే ఈ లైఫ్ సర్టిఫికెట్ పింఛన్దారుడు ఇంకా బతికే ఉన్నాడని రుజువు చేసే పత్రం. ఈ నెలాఖర్లోగా పింఛన్దారులు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.