న్యూఢిల్లీ, జనవరి 27: ఈ ఏడాది మార్చిచివరికల్లా బీమా దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ‘ఎల్ఐసీ వాటా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనే చేరుస్తాం. ఎందుకంటే మార్చి 31లోగా ఈ సంస్థను లిస్ట్ చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం’ అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) కార్యదర్శి తుహిన్ పాండే వెల్లడించారు. ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సంబంధించిన ముసాయిదా పత్రాల్ని ఖరారు చేస్తున్నామని, త్వరలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు పాండే తెలిపారు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరడానికి ఎల్ఐసీ ఐపీవో కీలకం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని ప్రతిపాదించగా, ఇప్పటివరకూ కొన్ని పీఎస్యూల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ. 9,330 కోట్ల సమీకరణ మాత్రమే జరిగింది. ఎల్ఐసీలో వాటా విక్రయం కోసం గతేడాది సెప్టెంబర్లో 10 మర్చెంట్ బ్యాంకింగ్ సంస్థల్ని ప్రభుత్వం నియమించింది.
ఐపీవోలో ఎంత వాటా విక్రయించాలన్న అంశంపై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నది. అలాగే విదేశీ ఫోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను ఈ ఐపీవోలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నది. సెబీ నిబంధనల ప్రకారం ఐపీవోలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. కానీ ఈ పెట్టుబడులకు సంబంధించి ఎల్ఐసీ చట్టంలో నిబంధన ఏదీ లేదు. ఈ కారణంగా సెబీ నిబంధనల ప్రకారమే ఎల్ఐసీ ఐపీవో అమలయ్యేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 1,437 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్టు ఎల్ఐసీ ఈ వారంలో ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో ఇది రూ. 6.14 కోట్లుగా ఉంది.