హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో కొంతమంది ఏదో చేయాలని చూస్తున్నారని, వాటిని సక్సెస్ కానివ్వబోమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి కుట్రలను అడ్డుకొన్నామని చెప్పారు. తాము హిందూ, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్కు తోడుగా ఉంటామని చెప్పారు. రాష్ర్టానికి మంచి ఐటీశాఖ మంత్రి (కేటీఆర్) ఉన్నారని, హైదరాబాద్లో ఐటీరంగం జోరుగా వృద్ధి చెందుతున్నదని ప్రశంసించారు. శనివారం అసెంబ్లీలో విద్య, వైద్యారోగ్యశాఖల పద్దులపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 4.5 శాతం నిధులు కేటాయించడం శుభ సూచకమని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ సూచీల్లో తెలంగాణ ఆరోగ్య రంగం టాప్-3లోకి చేరడాన్ని అభినందించారు. వైద్యారోగ్యశాఖకు గతేడాది కంటే రెట్టింపు నిధులు (రూ.10,711 కోట్లు) కేటాయించడాన్ని స్వాగతించారు. నిజామియా యునానీ దవాఖానలోని సమస్యలను పరిష్కరిస్తున్నందుకు మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. టిమ్స్ దవాఖానలో కరోనా బాధితులకు సేవలు అందించిన కాంట్రా క్ట్ సిబ్బందికి న్యాయం చేయాలని, ఉస్మానియా హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్టు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. హైదరాబాద్లోని మొత్తం పాఠశాలలను మొదటి దశలోనే అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను 298 నుంచి 973కు పెంచడంతో పాటు కొన్నింటిని కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వస్తున్న విద్యార్థులను టీసీలు లేకపోయినా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవాలని కోరారు. తెలంగాణలో ఉర్దూకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలను ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉర్దూ పాఠశాలల కోసం ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.