బెంగళూరు: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో యువ క్రికెటర్లకు పాఠాలు చెప్పాడు. ఈశాన్య రాష్ర్టాల క్రికెటర్లతో సమావేశమై.. వారిలో జోష్ నింపాడు. బీసీసీఐ వినతి మేరకు సోమవారం బెంగళూరులోని ఎన్సీఏను సందర్శించిన ఛెత్రీ.. అక్కడ శిక్షణ పొందుతున్న నార్త్ ఈస్ట్, ప్లేట్ గ్రూప్ ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి కుర్రాళ్లకు సూచనలిచ్చిన ఛెత్రీ.. ఆ తర్వాత కాసేపు సరదాగా క్రికెట్ ఆడాడు. ‘సునీల్ ఛెత్రీ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఫుట్బాల్లో అతడు నేర్చుకున్న అంశాలను కుర్రాళ్లతో పంచుకున్నాడు. క్రికెటర్లకు ఇది అద్భుతమైన సెషన్. అత్యున్నత స్థాయికి చేరడానికి ఎంతటి కృషి.. త్యాగాలు చేయాలో ఒక దిగ్గజ క్రీడాకారుడి ద్వారా తెలుసుకున్నారు’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.