తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిలింమేకర్స్ నేర్చుకోవాల్సి ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఇకపై బాలీవుడ్ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పిలవాలని సూచించారు. పాత పోకడలను అనుసరించకుండా కొత్త దారిని సృష్టించుకోవడమే తెలుగు సినిమా విజయాలకు కారణమన్నారు. తాజాగా కరణ్ జోహార్ మాట్లాడుతూ…‘బాలీవుడ్లో మూసధోరణి కొనసాగుతున్నది. బయోపిక్స్ హిట్ అయితే అంతా ఆ తరహా చిత్రాలనే రూపొందిస్తాం. సందేశాత్మక చిత్రాలు విజయం సాధిస్తే అవే. నాతో సహా దర్శకనిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగు సినిమా హాలీవుడ్లో, బాలీవుడ్లో ఏం చేస్తున్నారనే ఆలోచించడం లేదు. తమ సొంత ఆలోచనలతో కొత్త తరహా చిత్రాలను రూపొందిస్తున్నది. అందుకే ఇవాళ ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలు బాలీవుడ్లో గొప్ప విజయాలు సాధిస్తున్నాయి’ అని అన్నారు.