హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 58, 59ల కాలపరిమితిని మరికొంత కాలం కొనసాగించాలని క్యాబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ విధానంపై త్వరలోనే జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం ఉండేలా సిఫారసు చేయాలని తీర్మానించింది. ఇండ్ల స్థలాలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు టీ హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సీహెచ్ మల్లారెడ్డి ఇండ్ల స్థలాల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 60 గజాల వరకు స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని 20-30 సంవత్సరాలకు పైగా ఉంటున్నా.. చాలామందికి పట్టాలు లేవని తెలిపారు. గ్రామ కంఠం, ఎల్ఆర్ఎస్, యూఎల్సీ, దేవాదాయ, అటవీ, అసైన్డ్, వక్ఫ్ భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాలపై చర్చించారు. ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 59 కింద డబ్బు చెల్లించినా ఇంకా పెండింగ్లో ఉన్న వాటిని ఆమోదించాలని, తిరిగి ఈనెల 16న సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రివర్గం ఆమోదించాక ఈ నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. సమావేశంలో సీఎస్ సోమేశ్కుమార్, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.