లాహోర్ : పాక్ లాహోర్లో రద్దీగా ఉన్న షాపింగ్ మార్కెట్ వద్ద గురువారం బాంబు పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు దుర్మరణం పాలవగా.. దాదాపు 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మోటార్ బైక్ ద్వారా ‘టైమ్డ్ కంట్రోల్ డివైజ్’ ద్వారా పేలుడుకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది’ అని లాహోర్ పోలీస్ అధికార ప్రతినిధి రాణా ఆరిఫ్ తెలిపారు.
భారతీయ వస్తువులను విక్రయించే లాహోర్లోని ప్రసిద్ధ అనార్కలి మార్కెట్లో ఈ పేలుడు జరిగింది. పేలుడుతో దుకాణాలు, భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉండగా.. పేలుడు జరిగిన తీరును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ ఆపరేషన్ డాక్టర్ మహ్మద్ అబిద్ తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని, 20 మందికిపైగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామన్నారు.
మోటార్ సైకిల్లో లేదంటే ఇతర ప్రాంతంలో టైమ్ బాంబు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నామన్న ఆయన.. అయితే, అదేనని కచ్చితంగా చెప్పలేమన్నారు. ఉగ్రవాద నిరోధక, బాంబు నిర్వీర్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయన్నారు. ఘటనలో గాయపడ్డ వారిని మాయో ఆసుప్రతికి తరలించారు. అక్కడ ఇద్దరు మరణించారు.
ఒక బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు గాయాలకు గురై మరణించారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇఫ్తీకర్ తెలిపారు. ఆసుపత్రికి తరలించిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. పేలుడులో అనేక మోటార్ సైకిళ్లు, స్టాల్స్ దెబ్బతిన్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. పేలుడు తర్వాత అనార్కలి బజార్ను మూసివేశారు.