న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మోదీ సర్కారు బుధవారం పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ ఫక్తు కార్పొరేట్ల బడ్జెట్ అని, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని ట్రేడ్ యూనియన్ల నేతలు మండిపడుతున్నారు. బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కూడా బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023-24 బడ్జెట్తో తక్కువ వేతనాలున్న కార్మికులకు పైసా లాభంలేదని కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
బడ్జెట్ ఉత్త డొల్ల: ఏఐటీయూసీ
మోదీ సర్కారు ఆర్భాటం తప్ప కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని, అంతా ఉత్త డొల్ల మాత్రమేనని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) విమర్శించింది. నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య తదితర ముఖ్యమైన సమస్యలను బడ్జెట్లో పట్టించుకోనేలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఆర్థికమంత్రి నిర్మల అమృత్కాల్ పేరుతో ఎంతో ఆర్భాటంగా తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంటులో పెట్టారు. శరామామూలుగా బడ్జెట్ మొత్తం ప్రధాని మోదీ వాడే చతురోక్తులతో నిండి ఉన్నది. కానీ, వాస్తవంగా చూస్తే బడ్జెట్ కీలక సమస్యలను వదిలేసిన ఉత్త డొల్ల మాత్రమే. ప్రజా కేంద్రీకృత ఆర్థిక వృద్ధిని, మానవ వనరుల అభివృద్ధిని పట్టించుకోలేదు. బడ్జెట్ లెక్కలు వాస్తవాలకు ఆమడదూరంలో ఉన్నా యి. దేశంలోని శ్రామిక శక్తిలో 94 శాతం ఉండి, జీడీపీలో 60 శాతం సంపదను అందిస్తున్న అవ్యవస్థీకృత రంగాన్ని కేంద్రం గాలికి వదిలేసింది. దీర్ఘకాల ఉపాధి, నాణ్యమైన ఉద్యోగాల సృష్టిపై బడ్జెట్ ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఆదాయం పన్ను పరిమితిని పెంచామని చెప్తున్నప్పటికీ, అది చాలా తక్కువమందికి మాత్రమే ప్రయోజనకరం’ అని పేర్కొన్నది.
ఉద్యోగులకు లాభం సున్నా
కేంద్ర బడ్జెట్లో ఆదాయం పన్ను పరిమితిని రూ.7 లక్షల వరకు పెంచామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ వేతన జీవులకు దానివల్ల ఒరిగిందేమీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరిచాయి. కొత్త పన్ను విధానంతో ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం లేదని ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ స్టాఫ్ అసోసియేషన్ కార్యదరి ఎన్ శంకర్ పేర్కొన్నారు. ‘ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడినపడాల్సి ఉన్నదని, వ్యాపారాలు కొవిడ్-19 పూర్వపు స్థితికి రావాల్సి ఉన్నదని చెప్తున్నది.
మరోవైపు జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని ప్రకటిస్తున్నది. మరి ఈ పన్నులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే సామాన్యుడు ఇప్పటికే భరించలేనంత పన్నుల భారం మోస్తున్నాడని అర్థమవుతున్నది. ఈ బడ్జెట్ తర్వాత కూడా ఆ బరువు మోయాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత రంగాల్లో కోట్లమంది పనిచేస్తున్నారు. వారిలో చాలామందికి డీఏ, ఇతర అలవెన్స్లు అందటమే లేదు. కొవిడ్ వల్ల ఎంతోమంది మంచి ఉద్యోగాలను కోల్పోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాల్లో చేరారు. అలాంటప్పుడు సర్చార్జీలను కాస్త తగ్గించినంత మాత్రాన వారికి ప్రయోజనం ఏమి టి?’అని నిలదీశారు.
ఏమీలేదు: సీఐటీయూ
కేంద్ర బడ్జెట్ మొత్తం పక్కా రాజకీయ గిమ్మిక్కు తప్ప ఏమీ లేదని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) కార్యదర్శి తపన్సేన్ విమర్శించారు. ‘దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదు. నిజాన్ని దాచి అందమైన చిత్రాన్ని చూపేందుకు ఆర్థిక సర్వే ప్రయత్నించింది. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తినిస్తుందని కేంద్రం చెప్తున్నది. మరి ఆర్థిక వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితమవుతుందని ఆర్థిక సర్వే ఎందుకు అంచనా వేసింది? గత ఆర్థిక సంవత్సరంలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వృద్ధిరేటు 9.9 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ఏకబిగిన నాలుగేండ్లు ఆర్థిక వృద్ధి తగ్గటం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆహార సబ్సిడీని 29 శాతానికి తగ్గించారు. మధ్యాహ్న భోజనానికి నిధులు 9.4 శాతం తగ్గాయి. పౌష్టికాహార పథకాలకు ఏకంగా 38 శాతం తగ్గాయి’ అని విమర్శించారు.