రూ.6 కోట్లు తీసుకున్న కీలక నిందితుడు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో కీలక నిందితుడు ఏపీలోని పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో అరెస్టయిన నిందితుల సంఖ్య 16కు చేరింది. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన సాయికుమార్కు 2017 నుంచి కృష్ణారెడ్డి ప్రధాన అనచరుడిగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని నిజాంపేటలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణారెడ్డి ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టే కుట్రలో ప్రధాన భాగస్వామిగా వ్యవహారించినట్టు ఏసీపీ మనోజ్కుమార్ బృందం నిర్ధారించింది. ఎఫ్డీలను కొల్లగొట్టి పంచుకున్న వాటాల్లో కృష్ణారెడ్డికి రూ.6 కోట్లు చెల్లించినట్టు సాయికుమార్ వెల్లడించాడు. దీంతో ఆ సొమ్మును కృష్ణారెడ్డి ఎక్కడెక్కడ పెట్టాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.