న్యూఢిల్లీ: ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నీలో భారత యువ బాక్సర్లు క్రిష్ పాల్, రవి సైనీ ఫైనల్స్కు దూసుకెళ్లారు. జూనియర్ బాలుర 46 కిలోల విభాగం సెమీస్లో క్రిష్ థాయిలాండ్ బాక్సర్ కంగ్పి బొఖుమ్థడ్పై ఏకపక్ష విజయం సాధించగా.. రవి(48కి) 3-2తో బెక్సల్టాన్ బొరాన్బెక్ (కజకిస్థాన్)పై తీవ్ర శ్రమతో గెలిచాడు. తుది పోరులో అనుషెర్వాన్, ఇల్కోమ్జన్తో క్రిష్, రవి అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ టోర్నీలో భారత బాక్సర్లు తమ ప్రదర్శనతో 39 పతకాలు ఖాయం చేసుకున్నారు. యూత్ విభాగంలో 18 (మహిళలు 12, పురుషులు 6), జూనియర్ విభాగంలో 21 (అమ్మాయిలు 12, బాలురు 9) పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఈనెల 13, 14న ఫైనల్స్ జరుగనున్నాయి.