బెంగుళూరు: కిస్సింగ్ గేమ్లో పాల్గొన్న 8 మంది విద్యార్థులను మంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థులు సెయింట్ అలియోసిస్ కాలేజీకి చెందినట్లు గుర్తించారు. వారిని జువెనైల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి కిస్ చేసిన వీడియోను ఆర్నెళ్ల క్రితం తీశారు. అయితే తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కనిపించారు. మంగుళూరులోని లైట్ హౌజ్ హిల్ రోడ్డులో ఉన్న అపార్ట్మెంట్లో ఆ వీడియో తీశారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అబ్బాయితో తనకు అఫైర్ ఉందన్న విషయం అబ్బాయిలకు తెలుసు అని, కానీ కిస్సింగ్ వీడియో తర్వాత తనను ఆ అబ్బాయిలు బ్లాక్ మెయిల్ చేశారని ఆమె ఆరోపించింది.
వాట్సాప్లో వీడియో అప్లోడ్ చేసిన 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో వీడియోను తీసినట్లు విచారణలో తేలింది. ఓ గేమ్లో భాగంగా కిస్సింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఇద్దరు అమ్మాయిలను 8 మంది బాయ్స్ పలుమార్లు లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థుల కార్యకలాపాలపై కాలేజీ యాజమాన్యం దృష్టి పెట్టాలని సిటీ పోలీసు కమీషన్ ఎన్ శశికుమార్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనపై అనుమానాలు ఉంటే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. 8 మంది విద్యార్థులపై మూడు రకాల కేసులను నమోదు చేశారు. పోక్సో, ఐటీ చట్టం ప్రకారం కేసులు బుక్ చేశారు.