మాదాపూర్, డిసెంబర్ 24: నేటి పిల్లలే.. రేపటి మన భవిష్యత్తు అని, వారిలో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కిడ్స్ ఫెయిర్ 14వ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, చిన్నారుల ఆలోచనను, విధానాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. విద్యార్థి దశ నుంచే వారికి అనేక విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. సృజనాత్మకత, నైపుణ్యత పిల్లల భవిష్యత్ను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందన్నారు. ఈ క్యాక్రమంలో హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్, దుబాయ్ ఆధారిత బ్రాండ్ ఫాబీ బేబీ వ్యవస్థాపకులు మనోజ్ కంకనే తదితరులు పాల్గొనారు.
ఎస్కేప్ రూప్, కిడ్స్ రన్, సైన్స్ ఎగ్జిబిషన్, సృజనాత్మకతను పెంచే కోర్సులు, ఆట బొమ్మలు, పుస్తకాలు, పజిల్ గేమ్స్, పెయింటింగ్స్, మైండ్ బాక్స్, ఇస్రో స్పేస్ బస్, మూవింగ్ స్పేస్ ల్యాబ్, కిడ్స్ సేప్టీ టూల్స్ కోడింగ్ ప్రత్యేకం…
6 నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు సులభమైన పద్ధతిలో కోడింగ్ను నేర్పేందుకు ఆర్క్ సొల్యూషన్స్ ప్రై లిమిటెడ్ పేరిట స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో కోడింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్, త్రీడీ డిజైనింగ్, యానిమేషన్ వంటి కోర్సులపై శిక్షణ ఇస్తారు.
5 నుంచి 15 ఏండ్ల చిన్నారులకు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచేందుకు స్పార్క్ స్టూడియో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
ఈ ఫెయిర్కు నగర నలుమూలల నుంచి చిన్నారులు హాజరై ప్రదర్శనలో ఉన్న వాటిని గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 150 స్టాళ్లను అందుబాటులో ఉంచారు.
చిన్నారుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపర్చడానికి ఉపయోగపడేవి, బేకింగ్ మేడ్ ఈజీ వంటి స్టాల్స్ చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సైస్టెనబుల్ ష్యాషన్ ఉత్పత్తులు, కొబ్బరి టెంక ఉపయోగించి తయారు చేసిన షర్ట్ బటన్స్, తాడుతో తయారు చేసిన రంగురంగుల బుట్టలను ప్రదర్శనలో ఉంచారు.