చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో ఆదివారం మూడో మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు చెపాక్ మైదానంలో తలపడనున్నాయి. రెండు జట్లలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కోర్ టీమ్ ఒకేలా ఉంది. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని సన్రైజర్స్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. పేస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ గతేడాది స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే బ్యాటింగ్లో విదేశీ బ్యాట్స్మెన్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్పిన్నర్ రషీద్ ఖాన్లకు స్థానం ఖాయం. విదేశీ ప్లేయర్ల కోటాలో జానీ బెయిర్స్టోను తీసుకుంటే వార్నర్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. మిడిలార్డర్లో కేన్ విలియమ్సన్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక బ్యాటింగ్ లైనప్లో సీనియర్ ప్లేయర్ మనీశ్ పాండే, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. క్రితం సీజన్లో చెన్నై తరఫున దారుణ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న జాదవ్కు టీమ్ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. ఇతర ఆటగాళ్ల నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. జాదవ్కు జట్టులో స్థానం దక్కడం కష్టమే!
రెండుసార్లు ఛాంపియన్ కోల్కతా గతేడాది ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఆ జట్టు సమిష్టిగా రాణించడంలో విఫలమైంది. వరుస ఓటముల కారణంగా గతేడాది సీజన్ మధ్యలో అనూహ్యంగా సారథిని మార్చిన కేకేఆర్ ఈసారి మోర్గాన్ కెప్టెన్సీలో పకడ్బందీగా బరిలో దిగుతోంది. ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్, సునీల్ నరైన్ ప్రారంభిస్తే.. మిడిలార్డర్లో నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్కు వస్తారు. ఈసారి కొత్తగా జట్టులోకి వచ్చిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ను ఆడిస్తారో లేదో చూడాలి.
ప్రపంచ నంబర్ పేసర్ పాట్ కమిన్స్ ప్రధాన బౌలర్గా ఉన్నాడు. కమ్లేశ్ నాగర్కోటి, శివమ్ మావి ఇద్దరిలో ఒకరికి చోటు దక్కొచ్చు. ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. 2020లో సంచలన ప్రదర్శన చేసిన వరుణ్ నుంచి భజ్జీకి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యక్తిగత కారణాలతో భజ్జీ యూఏఈ వేదికగా జరిగిన 2020 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది చెన్నై అతన్ని వేలంలోకి వదిలేయగా కోల్కతా కొనుగోలు చేసింది.