KCR : సంగీత దర్శకురాలు, అభిమానులంతా ‘జానకమ్మ’ అని ప్రేమతో పిలుచుకునే, సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు. గాన కోకిలగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న జానకమ్మ గాత్రం అజరామరమని కేసీఆర్ అన్నారు.
చిన్ననాటి నుండే సంగీతం, గానం పట్ల మక్కువతో సినీ నేపథ్యగాయనిగా తన ప్రస్థానాన్ని సాగించిన జానకమ్మ, 60 యేండ్ల సంగీత జీవితంలో దాదాపు 50 వేల పాటలు పాడి, భారత సంగీతవనంలో పాటల కుసుమాలను పూయించిన మహోన్నత గాయని అని కేసీఆర్ కొనియాడారు. సినీ నేపథ్యగాయనిగా, సంగీత దర్శకురాలిగా.. తెలుగు, తమిళ ,కన్నడ, మళయాళీ.. తదితర భారతీయ భాషల్లో పాటలు పాడుతూ సినీ సంగీత జగత్తుకు చేసిన కృషి దేశ సాంస్కృతిక రంగంలో జానకి సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని కేసీఆర్ అన్నారు.
తన వృత్తిలో అనేక ఉత్తమోత్తమ అవార్డులను సొంతం చేసుకున్న జానకమ్మ, హృదయాన్ని హత్తుకునే, మనసును కదిలించే గాత్రంతో పాటు, సామాజిక స్పృహ కలిగివుందని గులాబీ బాస్ వెల్లడించారు. దక్షిణాది కళాకారులకు జరుగుతున్న సాంస్కృతిక అన్యాయాన్ని సహించలేక భారత ప్రభుత్వం తనకు 2013 లో ప్రకటించిన పద్మభూషణ్’ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన ధీర వనిత అని కేసీఆర్ ఆమెను కొనియాడారు.
పసిపాప నుంచి పండు ముదుసలి వయస్సు వరకు అన్ని రకాల పాత్రలకు తగ్గట్టుగా తన గాత్రాన్ని పాటగా మలిచి, సందర్భానికి తగ్గట్టుగా గమకాలతో నవరసాలను తన గానంలో నింపి.. గానామృతాన్ని పంచిన జానకమ్మ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. జానకి తండ్రి ఉద్యోగరీత్యా నాటి కరీంనగర్ జిల్లాలో జీవించడం, వారి కుటుంబం సిరిసిల్ల వాసులు కావడం తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
గానకోకిల జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సంగీతానికి, ‘పాట’ కు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ వంటి మహా గాయనికి జనన మరణాల భయం ఉండదనీ, వారి కీర్తి అజరామరం అని కేసీఆర్ తెలిపారు. జానకమ్మ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.