పోసుకుంటున్న రోజులవి. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో
టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. ఈ దీక్షకు ముందు కేసీఆర్కు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లోని 12 విద్యార్థి సంఘాలు జేఏసీ పేరిట సంఘీభావం ప్రకటించాయి.
కేయూలో 2009 నవంబర్ 23న 25 వేల మంది విద్యార్థులతో సభ జరిగింది. నేను అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కేసీఆర్తో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రసం గం విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. కేసీఆర్ దీక్షకు నాలుగైదు రోజుల ముందు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్లోని అన్ని విద్యాలయాల్లో కరపత్రాలు పంపిణీచేశారు. విద్యార్థుల నుంచి అనూహ్య మద్దతు లభించింది.
కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్లో ఆమరణ దీక్షలో పాల్గొనడానికి వెళ్తుండగా అల్గునూర్ చౌరస్తాలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఇది తెలంగాణలో అగ్గి రాజేసింది. కేసీఆర్ను ఖమ్మం తరలిస్తున్నారన్న సమాచారంతో విద్యార్థులు కేయూ 2వ గేటు వద్ద రాస్తారోకో చేసి కేసీఆర్ ఉన్న కాన్వాయ్ని అడ్డుకున్నారు. విద్యార్థులను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. యువనేత కేటీఆర్ సైతం అరెస్టయి ఒకరోజు జైలు జీవితం గడిపారు. కేసీఆర్ను ఖమ్మం జైలుకు తరలించారు. అక్కడ న్యూడెమోక్రసీ నేతలు కేసీఆర్ అరెస్టును అడ్డుకొని దీక్షకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ అంతటా విద్యార్థులు ఎక్కడికక్కడ దీక్షలు ప్రారంభించారు. కేయూలో తొలిసారిగా జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలకు దిగారు. కాంగ్రెస్ నాయకులను నిలదీస్తూ వారి ఇండ్లను ముట్టడించారు. కేసులకు భయపడకుండా కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.
ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలంతా సంబురాల్లో తేలిపోయారు. ఆంధ్ర పాలకులు ఆ సంతోషాన్ని ఒక్కరోజు కూడా లేకుండా చేశారు. ధనబలం, అంగబలంతో కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటును వెనక్కు తీసుకొనేలా చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కన్నెర్రజేశారు. ఇరవై రోజులపాటు వందలమంది విద్యార్థులతో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కేయూలో 2010 ఫిబ్రవరి 6న నిర్వహించిన విద్యార్థి పొలికేక, ఓయూ విద్యార్థి గర్జన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల పీఠాలను కదిలించాయనే చెప్పాలి.
కేసీఆర్ చొరవ తీసుకొని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలను సంఘటితం చేసి రాజకీయ ఐక్యవేదిక ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలను టీఆర్ఎస్ ముందుండి నడిపించింది. హుస్సేన్సాగర్ తీరాన చేపట్టిన సాగరహారం మైలురాయి. పోలీసులు, కేంద్ర పారా మిలిటరీ బలగాలు లాఠీచార్జీలు, బాష్పవాయువులు, గాలిలో కాల్పులు, జల ఫిరంగులు ప్రయోగించినా, లెక్కచేయకుండా సంజీవయ్యపార్కు నుంచి పీవీఘాట్ వరకు 2 కిలోమీటర్ల మేర సాగరహారం నిర్వహించారు.
ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి జైలు జీవితం గడిపారంటే అది కేసీఆర్ అందించిన ఉద్యమ ధైర్యమే. కేసీఆర్ చూపిన పోరాట మార్గంలోనే, 2014లో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. స్వరాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ జనరంజక పాలన అందిస్తున్నారు. తెలంగాణను అనేక రంగాల్లో అగ్రభాగాన నిలబెడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ఎగురవేసిన పోరాటబావుటా దేశంలో చర్చకు దారితీసింది. అనేక ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ ఆలోచనలను ఆచరించేందుకు ముందుకొస్తున్నాయి. అది కేసీఆర్ పోరాట విజయమని చెప్పాలి. కేసీఆర్ దీక్షాదివస్ అనేక పోరాటాలకు ఊపిరి పోసింది.