హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) సీజన్ 15లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నది. డిసెంబర్ 15న ప్రసారమైన ఎపిసోడ్లో ఈ కార్యక్రమ హోస్ట్ అమితాబ్ బచ్చన్ పోటీకి వచ్చిన యువతికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గురించి ప్రశ్న వేశారు. రేవంత్రెడ్డి ఏ రాష్ర్టానికి ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అడిగారు.
రూ.40 వేల ప్రశ్నగా దీన్ని బిగ్బీ అడిగారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఆ యువతికి సమాధానం తెలియలేదు. దీంతో ఆమె జవాబు కోసం లైఫ్లైన్ సహాయం తీసుకోగా, 80 శాతం మంది ‘తెలంగాణ’ అని చెప్పారు. 11 శాతం మంది ఛత్తీస్గఢ్ అని ఆన్సర్ ఇవ్వగా.. మిగతావారు సీ, డీ ఆప్షన్లు సూచించారు. ఎక్కువ మంది సూచించిన సమాధానాన్ని ఎంచుకున్న ఆ యువతి తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.