సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ తార కావ్య శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలపై నాయిక కావ్య శెట్టి మాట్లాడుతూ…‘ఈ సినిమా కన్నడలో విజయం సాధించిన ‘లవ్ మాక్టెయిల్’ చిత్రానికి రీమేక్. ఇందులో నేను అమ్ము అనే పాత్రలో కనిపిస్తాను. బడ్జెట్, స్టార్ కాస్ట్ పరంగా చూస్తే కన్నడ కంటే పెద్ద స్పాన్లో తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, మేఘా ఆకాష్తో పాటు నా పాత్ర కీలకంగా ఉంటుంది. విద్యార్థులే కాక అన్ని వయసుల వారు ఈ చిత్రాన్ని ఇష్టపడతారు. ఎమోషన్, మంచి కామెడీ ఉంటుంది. వాళ్ల నిజ జీవితంలోని ప్రేమ కథలు గుర్తొస్తాయి. సత్యదేవ్తో రొమాంటిక్ సన్నివేశాలు చేశాను. నాకు తెలుగు రాదు కాబట్టి అతనే డైలాగ్స్ చెప్పడానికి హెల్ప్ చేశాడు. ఈ సినిమా ఒప్పుకునే సమయానికి సత్యదేవ్కు హీరోగా బ్రేక్ రాలేదు. ఈ మధ్య అతను చేసిన సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. అతను మంచి కోస్టార్. పాండమిక్ వల్ల మా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తెలుగులో అరంగేట్రానికి ఇదే సరైన మూవీ అనుకుంటున్నాను. మా కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఇక్కడ స్టార్స్ అయ్యారు. అయితే రష్మిక తెచ్చుకున్న స్టార్డమ్ ఇంకెవరికీ రాదేమో. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి’ అని చెప్పింది.