శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ప్లే, డైరెక్టర్) చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కట్ల ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని, సుమన్, బ్రహ్మాజీ, అలీ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డి.ప్రశాంత్కుమార్ క్లాప్నివ్వగా, రాజశేఖర్-జీవిత కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా రంగం నేపథ్యంలో నడిచే కథ ఇది. ఇండస్ట్రీలోని వివిధ విభాగాల జీవన విధానం, వారు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయనే అంశాల్ని చర్చిస్తుంది’ అన్నారు. ‘చక్కటి వినోదం కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్ను కూడా మెప్పిస్తుంది’ అని నిర్మాత తెలిపారు. చమ్మక్ చంద్ర, శివారెడ్డి, సుమన్శెట్టి, ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గోవర్ధన్, సంగీతం: ప్రమోద్ కుమార్ శర్మ, ఎడిటింగ్: ఆనంద్ పవన్, నిర్మాత: ఈడీ ప్రసాద్, కొరియోగ్రఫీ, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: కట్ల రాజేంద్రప్రసాద్.