సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథిని అదుపులోకి తీసుకున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఖాతాదారులకు సంబంధించిన షేర్లను కుదువపెట్టి తీసుకున్న రూ.2,873 కోట్ల నిధులను 14 షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని ఆరోపణలపై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కంపెనీ చైర్మన్ పార్థసారథితోపాటు సీఎఫ్వో కృష్ణ హరిని కూడా ఇటీవల అరెస్ట్ చేసింది. ఇప్పటికే బెంగళూరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరిద్దరిని ఈ నెల 20న ప్రీవెన్షన్ మనీ లాండరింగ్ చట్టానికి లోబడి అదుపులోకి తీసుకున్నది ఈడీ.. ఈ నెల 25న నాలుగు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు పలు కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కార్వీ సంస్థలో ఖాతాదారులుగా ఉన్న వారి షేర్లను ఎలాంటి అనుమతి, నిబంధనలు పాటించకుండా పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంక్ల వద్ద తాకట్టుపెట్టి వేలాది కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే.