విద్యార్థుల ఈత సరదా ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన తమ కొడుకులు ఎప్పటిలాగే క్షేమంగా వస్తారనుకున్న వారికి తీరని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. సోమవారం సాయంత్రం మానేరు వాగులో ఆరుగురు బాలురు గల్లంతవడం కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. ఒక విద్యార్థి మృతదేహం అదే రోజు బయటపడగా, మంగళవారం మరో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఒక్కొక్కరి మృతదేహం బయటపడుతున్న సమయంలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ‘అయ్యో కొడుకా.. మేమేం పాపం చేసినం దేవుడా” అంటూ గుండెలవిసేలా రోదించారు.
మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
ఘటన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసానిచ్చారు.
సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్, నవంబర్ 16 : ఈత సరదా ప్రాణం తీసింది. అనుకోనిరీతిలో విద్యార్థుల మరణం.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సంతోషంగా వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ఐదుగురు చనిపోవడం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన మరో విద్యార్థి ఆచూకీ మంగళవారం రాత్రి వరకు కూడా దొరకకపోవడంతో గాలింపు కొనసాగుతున్నది.
ఇదీ జరిగింది..
సిరిసిల్ల మున్సిపల్ 11వ వార్డు పరిధిలోని రాజీవ్నగర్ కార్మికక్షేత్రానికి చెందిన కొలిపాక గణేశ్ (12), జడల వెంకటసాయి (13), తీగల అజయ్ (13), కొంగ రాకేశ్ (11), సిరిమల్ల క్రాంతికుమార్(14), సింగం మనోజ్(16), కోట అరవింద్ (14), దిడ్డి అఖిల్, వాసాల కల్యాణ్ సిరిసిల్ల ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు. వీరిలో రాకేశ్ 6వ తరగతి, గణేశ్, కల్యాణ్, క్రాంతి కుమార్ 8వ తరగతి విద్యార్థులు కాగా, మిగతావారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈతకొట్టేందుకని ఈ తొమ్మిది మంది సోమవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో నెహ్రూనగర్ ప్రాంతంలోని మానేరువాగుకు సైకిళ్లపై వెళ్లారు. అక్కడ చెక్ డ్యాం పరిసరాల్లో సైకిళ్లను ఉంచారు. దుస్తులు, చెప్పులను విడిచి ఈత కోసం నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో గణేశ్, వెంకటసాయి, రాకేశ్, క్రాంతి, అజయ్, మనోజ్ గల్లంతయ్యారు. కండ్ల ముందే స్నేహితులు మునిగిపోతుండడం చూసి మరో ముగ్గురు విద్యార్థులు అఖిల్, అరవింద్, కల్యాణ్ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 5గంటల తర్వాత గణేశ్ మృతదేహాన్ని వెలికి తీసి, మిగతా విద్యార్థుల కోసం రాత్రంతా వెదికారు. కరీంనగర్, వేములవాడ నుంచి రెస్యూటీం సభ్యులను రప్పించి మరీ గాలించారు.
సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు..
మంత్రికేటీఆర్ ఆదేశాలతో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, నేతలు సహాయక చర్యలు చేపట్టారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు మానేరువాగులో సంఘటనా స్థలం వద్దకు వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. తర్వాత ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. చిన్నారుల మృతికి సంతాపం ప్రకటించారు. నాయకులు బొల్లి రామ్మోహన్, శ్రావణ్రావు, ఒగ్గు రాజేశంతోపాటు కౌన్సిలర్లు కూడా ఆయాచోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మానేరు తీరంలో గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
మిన్నంటిన రోదనలు..
విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు సోమవారం సాయంత్రం మానేరు తీరం వద్దకు చేరుకున్నారు. ఐదు గంటల సమయంలో గణేశ్ మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురాగా, తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరుమన్నారు. మిగతా పిల్లల జాడ కోసం వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి వరకు పోలీసులు గాలించినా ఎలాంటి ఆచూకీ లేక తల్లడిల్లిపోయారు. రాత్రంతా తమ కొడుకులను తలుచుకుంటూ కుమిలిపోయారు. మంగళవారం ఉదయమే తిరిగి మానేరు వాగు వద్దకు చేరుకున్నారు. ఉదయం 9.30గంటల తర్వాత ఐదు మృతదేహాలను బయటికి తీయగా, గుండెలవిసేలా విలపించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా రోదించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో దవాఖాన ఆవరణ మొత్తం దద్దరిల్లిపోయింది. తమ కొడుకుల కోసం తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
మంగళవారం మరో నాలుగు మృతదేహాలు..
సోమవారం అర్ధరాత్రి వరకు వెదికినా ఎవరి జాడా దొరకకపోవడంతో తిరిగి మంగళవారం ఉదయమే రెస్యూటీం సభ్యులు రంగంలోకి దిగారు. స్థానిక నేతల ద్వారా విషయం తెలియడంతో మంత్రి కేటీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షించారు. హైదరాబాద్నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. కరీంనగర్ రెస్యూటీం సభ్యులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఉదయం 9.30గంటలకు వెంకటసాయి మృతదేహాన్ని వెలికితీయగా, 11.30గంటల్లోగా రాకేశ్, క్రాంతి, అజయ్ మృతదేహాలను బయటికి తీశారు.
మరో విద్యార్థి మనోజ్ కోసం గాలింపు..
మొత్తం ఆరుగురు విద్యార్థులు గల్లంతు కాగా, అందులో ఐదుగురి మృతదేహాలను బయటికి తీశారు. మరో విద్యార్థి సింగం మనోజ్ కోసం గాలిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతోపాటు యంత్రాల సహాయంతో వెదుకుతున్నారు. మంగళవారం రాత్రి 7గంటల వరకూ ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు చంద్రమౌళి, తల్లి భాగ్య కొడుకు కోసం తల్లడిల్లుతున్నారు. వీరికి డిగ్రీ చదువుతున్న కూతురు మధుమిత ఉండగా, కొడుకు మనోజ్ సిరిసిల్లలోని శ్రీకృష్ణదేవరాయ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడంతో గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
విద్యార్థుల మృతి దురదృష్టకరం
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
కలెక్టరేట్, నవంబర్ 16 : సిరిసిల్ల మానేరు చెక్డ్యాం వద్ద సోమవారం ఆరుగురు విద్యార్థులు గల్లంతవడం దురదృష్టకరమని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్నగర్కు చెందిన కొలిపాక గణేశ్, జడల వెంకటసాయి, తీగల అజయ్, కొంగ రాకేశ్, క్రాంతికుమార్ మృతదేహాలను బయటికి తీశారని, మరో విద్యార్థి సింగం మనోజ్ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని చెప్పారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
విద్యార్థులు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డేను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. ప్రత్యేక యంత్రాలతో గల్లంతైన విద్యార్థులను గాలించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఐదుగురు విద్యార్థుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జలవనరుల వద్ద ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు.