న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల్లో మాజీ భారత కెప్టెన్ బైచాంగ్ భూటియా పోటీ చేశారు. కానీ భూటియా అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. భూటియాకు కేవలం ఒకే ఒక ఓటు పడింది. చౌబేకు 33 ఓట్లు పోలయ్యాయి. కళ్యాణ్ చౌబే వయసు 45 ఏళ్లు. మాజీ ప్లేయర్ అయిన చౌబే గతంలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. 34 సభ్యుల ఓటర్ల జాబితాలో భూటియాకు మద్దతుదారులు కరువయ్యారు.
చౌబే గత పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లోని కృష్ణానగర్ సీటు నుంచి పోటీపడి ఓడిపోయారు. ఇండియా సీనియర్ జట్టుకు అతనెప్పుడూ ఆడలేదు. కానీ పలు మార్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇండియా తరపున ఏజ్ గ్రూపు ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం అతను ప్రాతినిధ్యం వహించాడు. ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఓ దశలో భూటియా, చౌబేలు కలిసి ఆడారు. ఉపాధ్యక్షుడి పోస్టుకు పోటీపడ్డ కర్నాటక ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ఏ హరిస్ గెలిచారు. రాజస్థాన్కు చెందిన మన్వేందర్ సింగ్పై అతను విజయం సాధించాడు. ట్రెజరరీ పోస్టును అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కిపా అజయ్ గెలిచాడు.