ముషీరాబాద్, నవంబర్ 12: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అంతకుముందు గణపతి పూజతో కోటి దీపోత్సవానికి అంకురార్పణ చేయగా సమస్త నదీ జలాలతో కాశీ నుంచి తీసుకువచ్చిన స్ఫటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన నిర్వహించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం చేయగా కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి, త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు జూపల్లి రామేశ్వర్రావు, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, శ్రీ రమ్యానంద సాధ్వీ పాల్గొన్నారు. స్వామివారు హంస వాహనంపై ఊరేగారు.