‘సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ‘అక్షర’ సినిమా ద్వారా అందిస్తున్న సందేశం ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలను హత్తుకోవాలి. పాఠశాల యాజమాన్యాలు, నాయకుల్లో ఈ సినిమా స్ఫూర్తి నింపుతుందని భావిస్తున్నా’ అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సీ కవిత. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘అక్షర’ ప్రీరిలీజ్ వేడుకకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాహాల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు.ఈ నెల 26న విడుదలకానుంది. సినిమా బిగ్ టికెట్ను కవిత, హీరో సాయితేజ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘చదువు కారణంగా కలిగే ఒత్తిడి వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పిల్లల్లో ఉండే ఆ ఒత్తిడి దూరం చేసేందుకు పాఠశాల యాజమాన్యాలు, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు ప్రయత్నాలు చేయాలి. ఈ అంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా చేశామని చిత్రబృందం నాతో చెప్పారు. వారు తీసుకున్న బాధ్యతలో నేను సైతం భాగం కావాలనే ఉద్దేశ్యంతో ఈ వేడుకకు హాజరయ్యాను. ‘అక్షర’ చిత్రబృందం నన్ను కలిసిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి చాలా సమాచారాన్ని సేకరించా. దేశవ్యాప్తంగా ప్రతిరోజు నలుగురైదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిసింది. ఈ ఆత్మహత్యల్ని అరికట్టేందుకు విద్యావిధానంలో ప్రభుత్వాలు చాలా మార్పులు తీసుకొస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించడానికి బట్టీ పట్టే విధానాన్ని తగ్గిస్తూ కళలు, నృత్యాల్ని సిలబస్లో భాగం చేస్తున్నాయి. గతంలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ సినిమా సరిగ్గా చదవని పిల్లల పట్ల తల్లిదండ్రులు ఆలోచించుకునేలా చేసింది. అలాంటి వివేచనను రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమా కలిగించాలి. పిల్లలపై చదువులో ఉండే ఒత్తిడిని తగ్గించాలి’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ను చూపించడానికి కవిత గారి ఇంటికి వెళ్లాం. ట్రైలర్ను చూసి వెంటనే బాగుందని అంటారనుకున్నాం. కానీ ఆమె డైరెక్టర్ ఎవరని అడిగారు. ఎవరిని గుర్తించాలో కేసీఆర్గారికి బాగా తెలుసు. అదే లక్షణాన్ని కవితగారు పుణికిపుచ్చుకున్నారు. తెలుగు సినిమాను బతికించడానికి ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వం తరపున కరోనా కష్టకాలంలో ప్రతి సినీ కార్మికుడి ఇంటికి నిత్యావసరాలు పంపించారు’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండేళ్ల ప్రయాణమిది. ఎన్నో కష్ట్టనష్టాలకోర్చి సినిమాను ముందుకు తెచ్చాం. ట్రైలర్ చూపించాలని కవితగారిని కలిశాం. ట్రైలర్ బాగా నచ్చడంతో ప్రీరిలీజ్ వేడుకకు వస్తానని మాటిచ్చారు. కవితగారు ఈ వేడుకకు రావడం మా టీమ్ అందరికి గొప్ప సంతోషాన్నిచ్చింది. సందేశాత్మక ఇతివృత్తంతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీతేజ్, మధునందన్, షకలకశంకర్, గౌరీనాయుడు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.